ఎన్ని రామాయణాలున్నాయి?

ఎన్ని రామాయణాలున్నాయి? మూడు వందలా? మూడు వేలా? కొన్ని రామాయణాల్లో చివర “ఇంతవరకూ ఎన్ని రామాయణాలొచ్చాయి?” అన్న ప్రశ్న అడిగేవారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కథలు కూడా అందులో ఉండేవి. అలాంటి కథలలో ఒక కథ వినండి.
ఒకరోజు రాముడు సింహాసనం అధిష్టించి ఉండగా, పొరపాటున అతడి ఉంగరం జారి కింద పడిపోయింది. ఈ ఉంగరం భూమిమీద పడడంతోనే, అది ఒక సన్నటి చిల్లు చేసి భూమి లోపలికి తొలుచుకుంటూ చొచ్చుకునిపోయి కనుమరుగైపోయింది. అది చూసి రాముడు తన నమ్మిన బంటు అయిన హనుమంతుడుతో “హనుమా, నా ఉంగరం పడిపోయింది. వెతికి తీసుకురా,” అని పురమాయించాడు.
హనుమంతుడు ఎంత చిన్న చిల్లులోకైనా ప్రవేశించగలడు. అవసరమయితే నలుసంత చిన్నగా మారగలడు. లేదా, మేరు పర్వతమంత పెద్దగా ఎదగగలడు. రాముని ఆజ్ఞ విని, హనుమంతుడు వెంటనే నలుసంత చిన్నగా మారిపోయి ఆ చిన్న రంధ్రంలో నుంచి తనూ దూసుకుపోయాడు. పోయిపోయి తిన్నగా పాతాళలోకంలో పడ్డాడు. ఈ చిన్ని కోతిని చూసి ఆశ్చర్యపోయిన అక్కడి యువతులు, అతడ్ని వారి పాతాళరాజుకు పళ్ళెంలో ఆహారంగా సమర్పించారు.
ఇది ఇలా ఉండగా, అక్కడ భూలోకంలో సింహాసనం మీద కూర్చున్న రాముని వద్దకు వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు వచ్చారు. వచ్చి “రామా, మేము కొన్ని విషయాలు నీతో రహస్యంగా మాట్లాడాలి. ఈ సంభాషణ ఎవ్వరూ వినకూడదు, భంగం కలిగించకూడదు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిని శిరచ్ఛేదన చేయాల్సి ఉంటుంది. సమ్మతమేనా?” అని అడిగారు.
“సమ్మతమే” అన్నాడు రాముడు. ద్వారం కాపలా కాయడానికి హనుమంతుడు లేడాయె. అందుకని, రాముడు లక్ష్మణుని పిలిపించి, అతడిని గుమ్మం వద్ద కాపలాకు నిలబెట్టి ఎవరినీ లోనికి రానివ్వవద్దని ఆజ్ఞాపించాడు.
లక్ష్మణుడు ద్వారానికి కాపలా కాస్తుండగా, విశ్వామిత్ర మహర్షి వచ్చి “నేను వెంటనే రాముణ్ణి చూడాలి. ఇది చాలా ముఖ్యం. రాముడెక్కడ?” అని గద్దించాడు.
“రాముడు రహస్య సమావేశంలో ఉన్నాడు. ఇప్పుడు లోనికి పోవడానికి వీల్లేదు.” జవాబు చెప్పాడు లక్ష్మణుడు.
“రాముడు నాతో చెప్పలేని రహస్యాలేముంటాయి. నేను ఇప్పుడే వెళ్ళి తీరాలి.” అన్నాడు విశ్వామిత్రుడు.
“నేను అన్నగారిని అడిగి, ఆయన అనుజ్ఞ తీసికోనిదే ఎవ్వరినీ లోపలకి వెళ్ళనీయలేను,” అన్నాడు లక్ష్మణుడు.
“అయితే తక్షణం లోపలికి పోయి నేను వచ్చానని రాముడికి చెప్పు,” అని విశ్వామిత్రుడు మళ్ళీ గద్దించాడు.
“రాముల వారు బయటికి వచ్చేవరకూ నేనే కాదు, ఎవ్వరూ లోపలికి పోరాదని నాకు మరీ మరీ చెప్పారు. అందుచేత మీరు కాసేపు ఓపిక పట్టి వేచి ఉండండి” అని లక్ష్మణుడు అనగానే, విశ్వామిత్రుడు తోకతొక్కిన తాచులా బుసకొడుతూ “నువ్వు వెంటనే రాముడికి నేను వచ్చినట్టు చెప్పకపోతే, నేను మీ రాజ్యాన్ని బూడిద పాలు చేస్తా!” అంటూ బెదిరించాడు.
“లోనికి వెళ్తే నేను చస్తాను. వెళ్ళకపోతే రాజ్యమే బూడిదౌతుంది. నాకన్న రాజ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి నేను చావడమే మేలు.” అని ఒక్క క్షణం ఆలోచించి లక్ష్మణుడు లోనికి వెళ్ళాడు.
“ఏమిటి విషయం” అడిగాడు రాముడు.
“విశ్వామిత్రులవారొచ్చారు”
“అయితే, లోనికి పంపించు”
విశ్వామిత్రుడు లోనికి ప్రవేశించాడు. వశిష్ఠుడు, బ్రహ్మదేవులతో జరుపుతున్న రహస్య సమావేశం అప్పటికే అయిపోయింది. వాళ్ళు శ్రీరాముడితో చెప్పిన మాటల సారాశం ఇది: “రామా! నీవు ఈ భూలోకంలో చెయ్యవలసిన పని అంతా పూర్తి అయ్యింది. నీవు ఇక ఈ మానవావతారం చాలించి మళ్ళీ దేవతల్లో చేరవలసిన సమయం వచ్చింది. ఈ విషయం చెప్పడానికే మేము సురలోకం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక మేము సెలవు తీసుకుంటాము.”
వాళ్ళిద్దరూ వెళ్ళగానే లక్ష్మణుడు, “అన్నా! రామా! నువ్వు ఇప్పుడు నా శిరస్సు ఖండించాలి,” అని అన్నాడు.
అందుకు శ్రీరాముడు,”లక్ష్మణా! నీ అపరాధం ఏమీ లేకుండా నీ శిరస్సు ఖండించడం దేనికి? బ్రహ్మ,వశిష్ఠులవారూ, వచ్చిన పని ఎప్పుడో పూర్తి అయ్యింది,” అని అన్నాడు


లక్ష్మణుడు “శ్రీరామా! నీవు ఆడిన మాట తప్పని వాడవని అందరికీ తెలుసు. నేను నీ తమ్ముడిని గనుక నీవు నన్ను వధించడానికి వెనుదీయడం ధర్మం కాదు. శ్రీరాముడు మాట తప్పినాడన్న మాట, ఆ కళంకం, నా మూలంగా నీకు రాకూడదు. నీవు నీ భార్యనే తిరిగి అడవులకు పంపినది మాట నిలబెట్టుకోవడం కోసమే కదా? నువ్వు ఇప్పుడు నన్ను శిక్షించక వదిలితే, నన్ను నేనే శిక్షించుకోవాలి. అనుజ్ఞ ఇవ్వు అన్నా! సెలవు” అని చెప్పి తను సరయూ నదికి వెళ్ళి మునిగి మరి తిరిగి కనిపించకుండా అంతర్థానం అయ్యాడు. లక్ష్మణుడు, ఆదిశేషుని అవతారం. తన దేహం చాలించవలసిన సమయం వచ్చిందని తనకి తెలుసు!
లక్ష్మణుడు అట్లా దేహత్యాగం చేసిన తరువాత, శ్రీరాములవారు లవకుశులకు పట్టాభిషేకం చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యమని విభీషణుడికి, సుగ్రీవుడికి, మిగిలిన ముఖ్య అనుచరులందరికీ చెప్పి, తను కూడా సరయూ నదికి పోయి తన మానవావతారాన్ని చాలించాడు.
ఇదిలా జరుగుతుండగా, హనుమంతుడు ఇంకా పళ్ళెంలో “రామ, రామ” అని జపం చేస్తూ ఉన్నాడు. పాతాళరాజు “ఎవరు నువ్వు?” అని అడిగాడు.
“నా పేరు హనుమంతుడు. రాముని బంటును. నా రాముని ఉంగరం చిల్లులో పడిపోయింది. దాన్ని వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను.”
పాతాళరాజు చుట్టూ చూసి ఒక పేద్ద పళ్ళెం తీసుకువచ్చాడు. ఆ పళ్ళెం నిండా వేలకొలది ఉంగరాలున్నాయి. “మీ రాముడి ఉంగరం వెతికి తీసుకొని నువ్వు పైకి పోవచ్చు” అన్నాడు!
ఆ బంగారు పళ్ళెం నిండా ఉన్న వేల ఉంగరాలను చూసి, హనుమంతుడు బేజారెత్తి పోయాడు. అన్నీ చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నాయి. “వీటిలో నా రాముడి ఉంగరం ఏదో నాకు తెలియటల్లేదు,” అంటూ బుర్ర గోక్కున్నాడు.
పాతాళరాజు నవ్వుతూ “చూడు! ఈ పళ్ళెంలో ఎన్ని ఉంగరాలున్నాయో, అంతమంది రాముళ్ళు ఉన్నారు. నువ్వు భూలోకానికి వెళ్ళేటప్పటికీ, నీ రాముడు తన అవతారం చాలించేసి ఉంటాడు. ఒక్కొక్క రాముడూ తన మానవావతారం చాలించడానికి ముందుగా ఆ రాముడి ఉంగరం నా పాతాళ లోకానికి వస్తుంది. ఆ ఉంగరాలన్నీ జాగ్రత్తగా దాచి ఉంచడం నా పని. ఇక నువ్వు భూలోకానికి పోవచ్చు,” అని ముగించాడు.

Comments

Popular Posts