రమణజీవి అక్షరాలోకనం - సింహాలపేట

పన్నెండు కథలు, పన్నెండు నిముషాల్లా గడిచిపోయాయి.. ఉదయం నుండీ సాయంత్రం లోపు పుస్తకాన్ని ఏక బిగిన చదివించాయి. విలయాన్ని సృష్టినీ ఒకే క్షణం లో అనుభవించే క్షణాలు... అరుదు. అవి ఈ కథల నిండా క్షణక్షణ ఉత్కంఠతో మెదడుని తొలిచేస్తూ, అక్షరాల వెంట కళ్ళను పరుగులు తీయిస్తాయి.

 పర్యావరణ వేత్తతో మొదలైన కథా యానం, అకస్మాత్తుగా ఒక కొత్త ప్రపంచం లోకి మనసు లో యేమూలో అది మన ఆలోచనే కదా అనిపిస్తూ , రచయిత తను సృష్టించిన పర్యావరణవేత్త పాత్ర ద్వారా మానవ జాతి మనుగడ కోసం మానవులనే మారణ హోమం చేయడాన్ని మౌనంగానే అంగీకరించేలా చేస్తుంది. టోటల్ సరెండర్ టు ది క్రియేటర్.  మనం రోజూ చూసే అబిడ్స్ ని మనోఫలకం మీద కొత్తగా చూసేలా చేస్తాడు. అది నచ్చేస్తుంది కూడా... నిజంగా మంచి జరుగుతుందంటే కొంత వినాశనాన్ని ఒప్పుకోవడం తప్పు కాదు అనిపిస్తుంది.

అక్కడి నుండి... "సముద్రానికి ప్రయాణం. అద్భుత మహోద్ధృత సముద్ర సృష్టి కి శ్రీకారం చుట్టిన రాజు కల. కొన్ని కలలు వాటిని నిజాలుగా మలిచే వరకూ నిలవనీయవు. రాజు రాజుతో పాటు అతని ప్రజలు కన్న ఒకే కల సముద్రాన్ని సృష్టించడం. కళ్ళనూ, మనసునూ మమేకం చేసిన మహోద్ధృత అక్షర సృష్టి.


 మూడో కథ , రేయ్ సుంకన్నా -- మనిషి లోని ఫాల్స్ ప్రిస్టీజ్ ని కుళ్ళ బొడిచి జీవితాన్ని ధ్వంసం చేసుకుంటూ, మానవత్వం లోని మహోన్నత్వాన్ని అనుభవించే క్షణాల దిశగా ప్రయాణం ఎంత దూఃఖ పూరితమో అంతే పరిమాణం లో ఆత్మ తన మలినాన్ని పోగొట్టుకుని శుభ్రపడిన ఆనందం.



ఎగిరే పాప, చివరి మనిషి, శతృవు --  వాటి ప్రవాహం లో కొంత ఉద్ధృతి తగ్గినట్టే తగ్గి, ఆకుపచ్చ ఇల్లు కథ తో మళ్ళీ మనల్ని నిలువెల్లా ఒక్క సారిగా కుదిపేస్తుంది. ఎక్కడో, ఎప్పుడో ఇది రచయిత తన కళ్ళారా చూసి అనుభవించో ఘనీభవించిన జ్ఞాపకాల ప్రతిసృష్టిలా అనిపిస్తుంది. కేవలం స్త్రి జాతే వున్నతమైందని నమ్మే గివాంగో వంశీయులమని చెప్పే ఆ మహిళ కథకుడి ఒక ప్రశ్నకు సమాధానంగా.. మేము పురుషుల్ని వుంచము, వొండుకుని తింటాము. వొంటికి చాలా మంచిది అన్న మాటలు కాజువల్ గా సాగుతున్న కథ లోంచి మనకు కాళ్ళ కింద నేలను కదిలించేస్తాయి.. కథ మొత్తం చదివే సరికి ఒకానొక హాలివుడ్ హారర్ సినిమా..  కళ్ళముందు వుంటుంది.

 మళ్ళీ మనల్ని మామూలు మనుషుల్లోకి లాక్కొచ్చే కథ ఆదిశేషమ్మ పేరుని హీరోయిన్ పేరుగా గా మలిచిన హృదయం కథ. కాలేజీ రోజుల్లోని ఆ తీయని జ్ఞాపకాల్నీ గతాన్ని తట్టి లేపే ముచ్చటైన కథ ఇది. Just loved reading it.. :) And the writer confirms its autobiographical touch!


 రచయిత చెప్పదలుచుకున్న అమూల్య స్వర్ణాక్షర ఆత్మ మోసుకొచ్చే కథ  సింహాలపేట -- అది చదవి అనుభూతి చెందాలే తప్ప మాటల కందదు. పుట్టుక నుంచీ చావు వరకూ కొలమానాల బ్రతుకులైన మనకు.. ఒక్క సారిగా ఆ కొలమానాలన్నీ అది అబద్ధం అనిపించేలా, ప్రేమ ఒక్కటే నిజం అనిపించేలా ఒక సెల్యులాయిడ్ కథా చిత్రం హృదయం మీద ముద్రిస్తుంది.

తర్వాతి కథలు చదువుతూ...
రమణజివి గారి కథా చిత్రాలని ముద్రించుకుంటూ చివరి పేజీ కి చేరే సరికి, ఏకం సత్ అన్న భావనా, కంటి వెంట ఎందుకో తెలియని కన్నీరు... హృదయాన్ని కడిగేసుకుంటు.. కొన్ని సంవత్సరాల తర్వాత  హృదయం  రససిద్ధిని అనుభవించింది.


-- Jayashree Naidu



Comments

Popular Posts